దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చి ఒకటో తేదీనాటికి 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2016–17 నుంచి 2020–21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25,267 మందిని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(ఆర్ఆర్బీలు) 2,04,945 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.
విదేశాలకు 6.4 కోట్ల టీకా డోసులు
ఈ ఏడాది జనవరి 12 నుంచి జూలై 22వ తేదీ వరకు సుమారు 6.4 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను విదేశాలకు పంపినట్లు లోక్సభలో పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. మరో 35.8 కోట్ల డోసులను దేశీయంగా పంపిణీ చేశామన్నారు.