చేతులెత్తి మొక్కుతున్నా.. క్రెడిట్​ మీరే తీసుకోండి: కేజ్రీవాల్​

6 Jun, 2021 13:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటింటికి రేషన్​ డెలివరీ పథకానికి కేంద్రం మోకాళ్లు అడ్డుపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్​ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారాయన.
 
‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్​దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ,  సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్​ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్​ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్​కాన్ఫరెన్స్​లో ప్రసగించిన ఆయన.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు   అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. 

‘‘కరోనా టైంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలుచేస్తోంది. రేషన్​ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు. 

కేసు ఉందనేనా?
కాగా, ప్రైవేట్​ డీలర్లలతో ఇంటింటికి రేషన్​ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ ఫైల్​ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్​ సర్కార్​ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్​ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్​ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్​ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్​ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్​ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్​ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. 

చదవండి: ఇంటికి రేషన్​.. ఇక్కడ తొలగిన అడ్డంకి

మరిన్ని వార్తలు