నరేంద్ర మోదీ పాత ట్వీట్‌ను జత చేసి.. విరుచుకుపడ్డ కేజ్రీవాల్‌

21 May, 2023 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్చునిచ్చింది.  ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు  జవాబుదారి అని,  నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. కాగా,  ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌  ట్వీట్‌తో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక సమస్యపై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ఫైర్‌ అవుతూ ఒక ట్వీట్ చేశారు.

అందులో “పార్లమెంట్ ఏమైనప్పటికీ సమావేశమవుతుంది. కేంద్రం పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకుని మంచి బిల్లు ఇవ్వలేకపోయింది? ఆర్డినెన్స్ ఎందుకు? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.  ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని ఉద్దేశించి ఆర్డినెన్స్‌ ఎందుకు సార్‌ అని మోదీ పాత ట్వీట్‌ని జత చేశారు ఢిల్లీ సీఎం . 

‘సేవల’పై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నేరుగా సవాల్‌ చేసే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తన అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలని తెలిపింది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్‌జీది కాదని తేల్చింది.  ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు  జవాబుదారి అని,  నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు.

మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఢిల్లీ పరిపాలన, అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల్లోనే.. తాజాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం బదిలీ, విజిలెన్స్ వంటి అంశాల్లో ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేసింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు