త్వరలో వైరస్‌ తగ్గుముఖం : కేజ్రీవాల్‌

24 Sep, 2020 16:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ రెండోసారి విజృంభించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈనెల ఆరంభంలో అనూహ్యంగా రోజువారీ కేసులు 4000 దాటడం వైరస్‌ రెండో విడత దాడి చేస్తోందనేందుకు సంకేతమని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో కేరళలో కరోనా కలకలం మొదలైన అనంతరం వైరస్‌ రెండో దశ తలెత్తిందని ప్రకటించిన తొలి రాష్ట్రం ఢిల్లీ కావడం గమనార్హం. కేజ్రీవాల్‌ గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ రాజధానిలో వైరస్‌ కేసులు పెరగడం కోవిడ్‌-19 రెండో దశకు సంకేతమని నిపుణులు చెబుతున్నారని అన్నారు.

సెప్టెంబర్‌ 16న ఢిల్లీలో 4500 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూడగా, ఆ తర్వాత కేసులు క్రమంగా తగ్గాయని మళ్లీ గడిచిన 24 గంటల్లో 3700 కేసులు వెలుగుచూశాయని సీఎం కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఢిల్లీలో సెప్టెంబర్‌ 9న తొలిసారిగా 4000కు మించి కరోనా వైరస్‌ కేసుల సంఖ్య నమోదవగా అదేరోజు 20 మంది మరణించారు. వైరస్‌ దేశ రాజధానిని తాకిన తర్వాత అత్యధికంగా ఈనెల 16న 4473 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా గురువారం నాటికి కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 57 లక్షలు దాటగా, 91,149 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 1129 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వారు రైతుల కోసం పోరాడారు

మరిన్ని వార్తలు