చరిత్రలో ఈ రోజు నిజంగా బ్లాక్‌ డే: ఒవైసీ

30 Sep, 2020 14:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. చరిత్రలో ఈ రోజు నిజంగా బ్లాక్‌ డే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదు. ‌ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టేయడం సరైన నిర్ణయమా? మసీదును ఎవరు కూల్చారో యావత్‌ ప్రపంచం చూసింది. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా. ఉమాభారతి మసీదును కూల్చండి అంటూ నినాదాలు చేయడం నిజం కాదా’ అంటూ ఒవైసీ ప్రశ్నించారు. అంతేకాక ఈ తీర్పుపై యావత్‌ ముస్లిం లోకం, పర్సనల్‌ లా బోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు ఒవైసీ. (చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు)

‘ఈ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు గతంలోనే ‘చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించడం.. బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య’గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక విషయాలు దాచిపెట్టింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని తీర్పు వెల్లడించింది. దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి.. చరిత్రలోని ఒక చర్యను అనర్హమైనదానిగా ప్రకటించడానికి ఇన్ని రోజుల సన్నహాలు అవసరమా. నాకు సమాధానం చెప్పండి’ అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు