-

బెయిల్ ఇవ్వకపోతే డ్రగ్స్‌ కేసు పెడతాం.. సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపులు

23 Aug, 2022 18:53 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌  సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో ‍‍అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబసభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్‌ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు.

ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. అనుబ్రత మండల్‌కు బెయిల్‌ ఇవ్వకపోతే తన కుటుంబసభ్యులందరిపై నార్కొటిక్‌ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(NDPS) కింద కేసు పెడతామని బప్ప చటర్జీ అనే వ్యక్తిపేరుతో లేఖవచ్చిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు పుర్వ వర్ధమాన్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ కోర్టులో హెడ్ క్లర్క్‌ అని, టీఎంసీ లీడర్‌నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్‌ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చదవండి: మా నాయకుడికి బెయిల్ ఇవ్వు లేకపోతే.. సీబీఐ జడ్జికి బెదిరింపులు

మరిన్ని వార్తలు