నిజమైన భారతీయులను రక్షిస్తాం: బీజేపీ మేనిఫెస్టో

23 Mar, 2021 16:47 IST|Sakshi

గుహవాటి: అస్సాం క్షేమం కోసం ‘జాతీయ పౌర పట్టిక’ (ఎన్నార్సీ)ని పటిష్టంగా అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. నిజమైన భారతీయులను కాపాడుకుంటాం.. చొరబాటుదారులను తరిమేస్తామని వ్యాఖ్యానించారు. అసోంవాసులు సురక్షితంగా ఉండండి అని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, ముఖ్యమంత్రి సరబనందా సోనోవల్‌తో కలిసి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 

అసోం రాజకీయ హక్కులు కాపాడుతామని, చొరబాట్ల కట్టడిని వేగవంతం చేస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద రిజర్వాయర్లు కడతామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. రిజర్వాయర్‌తో వరదల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. 30 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున నెలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అసోం స్వయం సమృద్ధి కోసం సూక్క్ష్మ, స్థూల ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు.

రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన. వారిలో 2022 మార్చి 1లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రధానంగా బీజేపీ మరో హామీ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో 8 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. భూమి లేనివారికి పట్టా పద్ధతి అమలు చేస్తామని వెల్లడి. 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెల్లడవుతాయి.

మరిన్ని వార్తలు