అప్పుడు మోదీని చూసి మేమేమీ అనలేదు కదా.. కాంగ్రెస్‌ కౌంటర్‌

23 Nov, 2022 14:48 IST|Sakshi

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేల పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. అధికార బీజేపీ మరోసారి అధికారం కోసం సరికొత్త ప్రచారంతో ముందుకు సాగుతోంది. అటు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్లాన్స్‌ రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌తో పోల్చారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల పద్ధతులు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంస్కృతులను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు అని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరడానికి బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ డబ్బు చెల్లించిందని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇక, అంతుకుముందు కూడా హిమంత.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌కు ఓటు వేసిన వ్యక్తులు త్వరలో బీజేపీలో చేరుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇక, బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ కౌంటర్‌ అటాక్‌ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా గడ్డం పెంచుకున్నప్పుడు ఆయనపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే, మేము నిజమైన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాము. అసలు విషయాలను పక్కదారి పట్టించడం బీజేపీ నేతలకు మాములే అంటూ ఎద్దేవా చేశారు. భారత్‌ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందని అన్నారు. 

మరిన్ని వార్తలు