కాల్పుల కలకలం: పరుగులందుకున్న అస్సాం ఎమ్మెల్యే

28 May, 2021 10:10 IST|Sakshi

గౌహతి: తుపాకుల మోతతో భీతిల్లిన ఓ ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది పరుగులు అందుకున్న ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. నాగాలాండ్​తో సరిహద్దుగా ఉన్న జోర్హాట్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్​జ్యోతి కుర్మి, ఆయన భద్రతా సిబ్బంది అక్రమ పనులను పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. దీంతో ఎమ్మెల్యే పరుగులు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అస్సాం జిల్లాలైన చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్​లు  నాగాలాండ్‌తో సరిహద్దును కలిగివున్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో నాగాలాండ్​ దురాక్రమణలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరియాని ఎమ్మెల్యే రూప్​జ్యోతి కుర్మి తన సిబ్బంది, కొందరు మీడియా ప్రతినిధులతో దేసో వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్​కు వెళ్లారు. అక్కడి ఆక్రమణలను పరిశీలిస్తున్న టైంలోనే తుపాకుల మోత వినిపించింది. తనను టార్గెట్​ చేసే ఆ కాల్పులు జరిగాయని కుర్మి తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నామని, సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం నాగాలాండ్ సర్కారుతో మాట్లాడటం లేదని కుర్మి ఆరోపించారు. కాగా, ఈ కాల్పుల్లు ముగ్గురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

అస్సాం సీఎం స్పందన
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితులపై పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారి జీపీ సింగ్‌ను ఆదేశించారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. నాగాలాండ్ భూభాగం నుంచే కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు