ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం!

13 Jun, 2021 10:34 IST|Sakshi

గువాహటి: అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అక్కడి మీడియాలో ఎక్కువ ఫోకస్‌ కావడంతో ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. 

కోక్రాజ్‌హర్‌ జిల్లా అభయకుటి గ్రామం శివారులోని అడవుల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు చుట్టాలయ్యే ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఒకరి వయసు 16, మరొకరి వయసు 14. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారని బంధవులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించి.. నివేదిక కోసం ఎదురు చూస్తు‍న్నారు. 
 
బాధితుల్లో ఒకరు అనాథ కాగా, మరొక తల్లి రోదనలతో అభయకుటిలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ జ్యుడిషియల్‌ ఎంక్వైరీ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కోక్రాజ్‌హర్‌ పోలీసులు చెప్తున్నారు.

చదవండి: శారీరక సుఖం కోసం పోయి..

మరిన్ని వార్తలు