రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు..!

17 Aug, 2022 09:09 IST|Sakshi

గువాహటి: క్షణికావేశంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు కొందరు. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై వేసిన రూ.500 పందెంపై మొదలైన ఓ గొడవ వ్యక్తి ప్రాణాలు తీసింది. క్షణికావేశంలో ఎదుటి వ‍్యక్తి తల నరికి చేతిలో పట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ సంఘటన అస్సాంలోని సొనిత్‌పుర్‌ జిల్లాలో సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫూట్‌బాల్‌ మ్యాచ్‌ అనంతరం గొడవ జరిగినట్లు చెప్పారు.

ఫూట్‌బాల్‌ మ్యాచ్‌కు ముందు నిందితుడు తునిరామ్‌ మాద్రిని బాధితుడు బోయిలా హెమ్‌రామ్‌ రూ.500 అ‍ప్పు అడిగాడు. అందుకు నిందితుడు నిరాకరించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత నిందితుడు బెట్‌లో ఓ మేకను గెలుచుకున్నాడు. ఆ మేకును కోసేందుకు తనతో రావాలని బోయిలా హెమ్‌రామ్‌ను కోరాడు నిందితుడు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. బోయిలా హెమ్‌రామ్‌ను హత్య చేసిన తర్వాత అతడి తలతో ఇంటికి వెళ్లాడు నిందితుడు. అక్కడే ఉన్న అతడి సోదరుడు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఆ తర్వాత 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్‌ స్టేషన్‌కు తలతో వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసేందుకు ఉపయోగించిన కొడవలిని సైతం తీసుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం?

మరిన్ని వార్తలు