కోర్టుకు హాజరు కావాలంటూ.. ఆరేళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి నోటీసులు!!

22 Mar, 2022 19:36 IST|Sakshi
భార్యతో శ్యామ్‌ చరణ్‌ దాస్‌ (పాత చిత్రం)

సాక్షి అస్సాం(సిల్చార్‌): కొన్ని సంఘటనలను చూస్తే మన వ్యవస్థలోని లోపాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సామాన్యుడిని ఇష్టానుసారమో లేదంటే నిర్లక్ష్యపూరిత వైఖరితోనో కేసులు పెట్టి..  ఇబ్బంది పెట్టడమే కాకుండా అధికారులు సైతం చిక్కుల్లో పడుతుంటారు. అచ్చం అలాంటి ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయి ఆరేళ్లైంది. ఇప్పుడు అతను తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నోటీసులు పంపారు. 

వివరాల్లోకెళ్తే.... అస్సాంలోని సిల్చార్‌ గ్రామానికి  వచ్చి నివాసం ఉన్న శ్యామ్‌ చరణ్‌ దాస్‌ పై అక్రమ వలసదారునిగా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అయితే ఆ వ్యక్తి మే 6, 2016న 74 ఏ‍ళ్ల వయసులో చనిపోయాడు.  అతని మరణం తర్వాత కుటుంబ సభ్యులు అస్సాం ప్రభుత్వం జారీ చేసిన  మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. అస్సాం కోర్టు దాస్‌ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 23, 2016న కేసు ముగించేసింది కూడా. 

పైగా న్యాయమూర్తి నాటి కోర్టు ఉత్తర్వుల్లో ఇలా రాశారు... ‘‘సుదన్‌ రామ్‌ దాస్‌ కుమారుడైన చరణ్‌ దాస్‌ కుటుంబ సభ్యులు మే 06, 2016న సిల్చార్‌ మెడికల్‌ కాలేజ్ ఆసుపత్రిలో మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించారు. తాలిగ్రామ్‌ ఉదర్‌బాండ్‌ నివాసి అయిన  అనుమానాస్సద ఓటరు అయిన దాస్‌ రికార్డుల ప్రకారం అతని తండ్రి సుధన్ రామ్ దాస్ పేరు 1965 నుంచి 1970 ఓటర్ల జాబితాలో ఉంది కావున కేసును కొట్టివేస్తున్నాం’’ అని జడ్డీ పేర్కొన్నారు.

కానీ, ఈ ఏడాది ప్రారంభంలో అక్రమ వలసదారునిగా అనుమానంతో సరిహద్దు పోలీసులు చరణ్‌ దాస్‌ పై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో కాచర్ జిల్లాలోని  ఫారిన్‌ట్రిబ్యునల్‌ (ఎఫ్‌టీ-3) ప్రకారం  అతని పై కేసు నమోదైందని మార్చి 15న నోటీసులు జారీ చేసింది. పైగా తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు మార్చి 30న హాజరుకావల్సిందిగా స్పష్టం చేసింది. విశేషం ఏంటంటే.. ఏ కోర్టు అయితే కేసును  కోట్టేసిందో మళ్లీ ఆ కోర్టే నోటీసులు జారీ చేసింది. పైగా ఆ నోటీసులో చరణ్‌ దాస్‌ ప్రతిస్పందించడంలో విఫలమైనప్పుడు, ట్రిబ్యునల్ రిఫరెన్స్ ఎక్స్‌పార్టీగా నిర్ణయించి అతనిపై తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొంది.

అయితే దాస్ భార్య సులేఖా దాస్ కూడా ఎక్స్-పార్టీ ఆర్డర్‌లో తన భారతీయ గుర్తింపును కోల్పోయింది. ఏప్రిల్ 2018లో విదేశీయుల కోసం ఉద్దేశించిన డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఏప్రిల్ 2020లో బెయిల్‌పై విడుదలైంది. అయితే మార్చి 16న, ఉదర్‌బాండ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారుల బృందం తాలిగ్రామ్ గ్రామంలోని సులేఖా దాస్ ఇంటికి చేరుకుని, మృతుడికి వ్యతిరేకంగా కొత్త నోటీసును కుటుంబ సభ్యులకు అందజేసింది.

చరణ్‌ దాస్ కుమార్తె, బేబీ దాస్ మాట్లాడుతూ.. “మా తండ్రిని అర్ధ దశాబ్దం క్రితమే కోల్పోయాం. అయితే అతను జీవించి ఉన్నాడని కోర్టు అంటోంది. మా నాన్నగారి దగ్గర తన గుర్తింపును రుజువు చేసేందుకు తగిన పత్రాలు ఉన్నప్పటికీ, ఆయన బతికున్నప్పుడు మేము కోర్టు చుట్టూ తిరిగాం. ఇప్పుడు, అతని మరణం తర్వాత మేము అతని తరపున కోర్టుకు హాజరు కావాలి. ఎలా ప్రతిస్పందించాలో నాకు తెలియడం లేదు" అని అన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ)  సామాజిక కార్యకర్త కమల్ చక్రవర్తి బేబీ దాస్‌కు తమ మద్దతును అందించారు. మార్చి 30న కోర్టు ముందు డాక్యుమెంట్లు  సమర్పించడంలో వారు ఆమెకు సహాయం చేయనున్నారు. ఏదీఏమైన మన వ్యవస్థ లోపాలు తేటతెల్లమవుతున్నాయి. పోలీసుల ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరారు. అంటే డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ కోసం పోలీసులు నిందితుడి ఇంటికి కూడా వెళ్లలేదని అర్థమవుతోంది.

(చదవండి: కన్నతల్లి నిర్వాకం... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి)

మరిన్ని వార్తలు