Assam: నీ ప్రేమ చావులేనిది. అంత లవ్‌ ఏంటి సామీ!

21 Nov, 2022 20:08 IST|Sakshi

ప్రేమ.. ఇది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. పురాణాలు, రాజుల కాలం నుంచే ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో ప్రేమికులు కాలక్రమంలో ప్రాణాలు సైతం వదిలారు. కొందరు ప్రేమించిన వారి ప్రాణాలను తీశారు. కాగా, ఇక్కడ మాత్రం తాను ప్రేమించిన యువతి కోసం ఎవరూ చేయని ధైర్యం చేశాడు. చనిపోయిన తన ప్రేయసి మృతదేహానికి తాళికట్టి తనది నిజమైన ప్రేమ అని నిరూపించుకున్నాడు. 

వివరాల ప్రకారం.. ఈశాన్య రాష్ట్రం అసోంలోని మోరిగావ్‌ జిల్లాకు చెందిన బిటుపన్‌ తములి(27), అలాగే.. కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల వీరి ప్రేమ విషయం.. వారిద్దరి కుటుంబాలకు కూడా తెలుసు. ఈ క్రమంలో వారికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో విధి వారి ఆశలకు అడ్డుపడింది. బోరా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఊహించని విధంగా తుదిశ్వాస విడిచింది. 

తన ప్రేయసి మరణవార్త విన్న తములి.. కన్నీటిని గుండెలోనే దాచుకున్నాడు. ఆమె దేహం మాత్రమే తనకు దూరమైందనకున్నాడు. ఇంతలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేనని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పాడు. అనంతరం.. అందరినీ ఒప్పించి తన ప్రేయసి మృతదేహానికి తాళికట్టి.. ఆమెను భార్యను చేసుకున్నాడు. ఆమె నుదిటిపై బొట్టు పెట్టి.. మెడలో దండ వేసి పెళ్లి తంతు పూర్తి చేశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బిటుపన్‌ చేసిన పనికి స్థానికులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు