Covid-19: థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు.. మరోసారి అన్ని జిల్లాల్లో నైట్‌ కర్ఫ్యూ

1 Sep, 2021 13:12 IST|Sakshi

గువాహటి: ప్రాణాతంక కరోనా వైరస్‌ వ్యాప్తి, థర్డ్‌వేవ్‌ ఆందోళనల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కట్టడిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. 

అదే విధంగా గత వారం రోజులుగా 10కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటోన్మెంట్‌ జోన్లుగా ప్రకటించనున్నట్లు అసోం ప్రభుత్వం వెల్లడించింది. నేటి నుంచి (సెప్టెంబరు 1, బుధవారం) కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 570 మంది కరోనా బారిన పడగా, ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరోవైపు.. అసోంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. 

అసోం ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు, నిబంధనలు:
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు
ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పనిప్రదేశాల్లో యధావిధిగా విధులు నిర్వర్తించుకోవచ్చు. అయితే, రాత్రి ఎనిమింటికల్లా మూసివేయాలి.
రెస్టారెంట్లు, హోటళ్లు, రిసార్టులు, దాబాలు తదితర ఈటరీలు, షోరూంలు, కోల్డ్‌ స్టోరేజీలు, వేర్‌హౌజులు, నిత్యావసరాలు విక్రయించే షాపులు, పాల కేంద్రాలు సైతం రాత్రి 8 గంటల వరకు మూసివేయాలి.
ఒకే వాహనం(బైకు)పై ఇద్దరు ప్రయాణించవచ్చు. అయితే, అందులో కనీసం ఒక్కరైనా వ్యాక్సిన్‌ వేసుకుని ఉండాలి. ఇద్దరూ కచ్చితంగా మాస్కులు ధరించాలి.
అంతరాష్ట్ర ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. 100 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు, ఇతర వాహనాలు నడుపవచ్చు. అయితే, కచ్చితంగా కోవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ అయినా వేసుకుని ఉండాలి.
ఇక పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, హయ్యర్‌ సెకండరీ ఫైనల్‌, నర్సింగ్‌ కోర్సు, ఇతర సాంకేతిక విద్యాసంస్థలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్‌ సింగిల్‌ డెస్‌ తీసుకుని ఉండాలి. వీరి కోసం మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలి.
సింగిల్‌ డోసు వేసుకున్న వాళ్లు, అత్యధికంగా 50 మంది ఫంక్షన్లలో పాల్గొనవచ్చు. స్థానిక పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే సమావేశాలు నిర్వహించుకోవాలి. ఇక కలెక్టర్‌ అనుమతితో 200 మంది(వ్యాక్సినేటెడ్‌ పీపుల్‌) ఏదేని సమావేశానికి హాజరు కావచ్చు.
పెళ్లి, అంత్యక్రియల వంటి కార్యాలకు గరిష్టంగా 50 మంది, మతపరమైన, పవిత్ర స్థలాల్లో 40 మంది సమావేశాలకు హాజరు కావచ్చు(వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లు మాత్రమే).
 తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సినిమా థియేటర్లు తెరవకూడదు.

చదవండి: అసోం వరదలపై ప్రధాని ఆరా
తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు..

మరిన్ని వార్తలు