తప్పతాగి దర్జాగా నిద్రపోయాడు; రైల్వే సేవలకు అంతరాయం

17 Jul, 2021 12:24 IST|Sakshi

ఢిల్లీ: అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌(ఏఎస్‌ఎమ్‌) నిర్వాకంతో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదు. దీంతో ఏమైందోనని ఉరుకులు పరుగుల మీద వచ్చిన అధికారులు అక్కడి పరిస్థితిని చూసి షాక్‌ తిన్నారు. అ‍ప్పటికే ఫూటుగా మద్యం తాగి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది.

వివరాలు.. ఢిల్లీకి చెందిన అనిరుద్‌ కుమార్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం విధులకు హజరైన అతను డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి వెనుకాల చాలా గూడ్స్‌ రైళ్లు కూడా ఆగి ఉన్నాయి. ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు అనిరుద్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు.

ఎంతసేపటికి ఫోన్‌ తీయకపోవడంతో అధికారులు వచ్చి చూడగా.. అధికారులు షాక్‌ తిన్నారు. అనిరుద్‌ కుమార్‌ దర్జాగా నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా.. మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసి తుండ్లాలోని మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తరలించారు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఇలాంటి అధికారులు ఉండడంతోనే దేశం ఇలా తగలడింది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు