ఆటోమొబైల్స్ విక్రయాల్లో స్వల్ప పురోగతి

19 Sep, 2020 14:51 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆటోమొబైల్స్ అమ్మకాలు క్రమేపీ పుంజుకుంటున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి  ప్రకాష్ జవదేకర్ తెలిపారు. గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 75.29 శాతం పెరిగినట్లుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని రాజ్యసభలో శనివారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణీకుల వాహనాల విక్రయాల్లో 3.86 శాతం, మూడు చక్రాల వాహనాల విక్రయాల్లో 77.16 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 15.24 శాతం క్షీణత నమోదైనట్లుగా ఆయన తెలిపారు. (టెక్‌ షేర్లు వీక్‌- యూఎస్‌ వెనకడుగు)

ఫైనాన్స్ లభ్యత తగినంత లేకపోవడం, కమర్షియల్ వాహనాల యాక్సిల్ లోడ్ పరిమితిని 25 శాతానికి పెంచడం వలన కొత్త వాహనాల అవసరం తగ్గిపోవడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వసూళ్ళతో వాహన కొనుగోలు ఖర్చు పెరగడం, బీఎస్ 6 ప్రమాణాల ప్రకారం కొత్త వాహనాల తయారీ, కరోనా మహమ్మారి కారణంగా వాహన కొనుగోళ్ళకు ప్రజలు మొగ్గు చూపకపోవడం...ఇత్యాది కారణాలతో ఆటోమొబైల్ రంగం పురోగతి మందగించినట్లు మంత్రి చెప్పారు. ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీల రూపంలో ఆర్థిక రంగంలో ఊపు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్స్ విక్రయాలపై జీఎస్టీ తగ్గింపు తమ చేతుల్లో లేదని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకే పన్నుల విధింపు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. (రెండు దశాబ్దాలలో.. రికార్డ్‌ లిస్టింగ్స్‌)

మరిన్ని వార్తలు