అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు నామకరణం‌.. పేరేమిటంటే

22 Feb, 2021 22:21 IST|Sakshi

లక్నో: హిందూవుల చిరకాల కల.. కోట్లాది మంది ప్రజల భక్తిభావనతో ముడిపడిన క్షేత్రం అయోధ్య. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే విరాళాలు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రామ మందిర నిర్మాణం ఒక్కో దశ పూర్తి చేసుకుంటోంది. ఆలయ నిర్మాణంతో పాటు అయోధ్య నగర రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే విమానాశ్రయం సిద్ధమవుతుండగా తాజాగా ఎయిర్‌ పోర్టుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త పేరు పెట్టింది.

రాముడి పేరు వచ్చేలా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు పెట్టారు. ఈ మేరకు అధికారిక ప్రకటన సోమవారం జారీ చేశారు. ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ ఎయిర్‌పోర్టు’ అని నామకరణం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో యోగి ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.101 కోట్లు కేటాయించింది. ఈ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాడుతోంది. దీనికోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది కూడా. రాష్ట్రంలోని అలీగడ్‌, మొరాదాబాద్‌, మీరట్‌ వంటి నగరాల నుంచి అయోధ్యకు రాకపోకలు ప్రారంభించనున్నట్లు యోగి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కొన్ని నగరాలకు యోగి ప్రభుత్వం కొత్త పేర్లు పెడుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు