చైతన్య భారతి: కింగ్‌ మేకర్‌

27 Jun, 2022 10:07 IST|Sakshi

ఆయన మంచి మిత్రుడు. కానీ ప్రమాదకరమైన ప్రత్యర్థి. ఆయన చరిత్రను సృష్టించారు. కానీ అదంతా కీర్తించదగినదే కానవసరం లేదు. ఆయన పత్రికా స్వాతంత్య్రాన్ని గట్టిగా సమర్థించుకున్న వ్యక్తిగా గుర్తుండిపోతారు. నియంత్రణలు, ఆంక్షల ద్వారా దాని ఆత్మ నిర్భరత, స్వాతంత్య్రాలను దెబ్బతీయడానికి పన్నే ఎటువంటి కుతంత్రాల పైన అయినా ఆయన ఎదురొడ్డి పోరాడేవారు. అత్యవసర స్థితి (1975)ని వ్యతిరేకించడంలో అది శిఖర ప్రాయంగా కనిపించింది.

సమస్యలను కొని తెచ్చుకోవడం ఆయన లక్ష్యం కాదు. కానీ తన ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తూ ఉన్నా, లేదా తనను వ్యతిరేకిస్తున్నా తన సర్వ శక్తులనూ ఒడ్డి ప్రత్యర్థులపై పోరాడటం ఆయన స్వభావం. ఆయన అకుంఠిత జాతీయవాది. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తనకు తానుగా కాంగ్రెస్‌కి క్వార్టర్‌ మార్షల్‌ జనరల్‌గా పని చేశారు. అంటే.. సైన్యంలో సరకులను సరఫరా చేసే వ్యక్తిగా! క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ఆజ్ఞాతవాసంలో ఉన్న విప్లవ ఉద్యమకారులకు ఆయన పేలుడు పదార్థాలు సరఫరా చేశారు. దేశ విదేశాలలో పంపిణీ చేసేందుకు, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్దేశించిన సాహిత్యాన్ని ముద్రించారు.

ఆయన ప్రభుత్వంలో ఎన్నడూ లేరు. కానీ, ఆయనకున్న గణనీయమైన రాజకీయ సంబంధాల కారణంగా ఆయన ఒకరకమైన కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌ కార్యకర్తగా, స్వాతంత్య్రోద్యమ సేవకుడిగా అవి ఆయన తన చిన్నతనం నుంచి నిర్మించుకున్న సంబంధాలు. సమాచార సాధనాలు లేనిదే కాంగ్రెస్‌ సందేశం సామాన్య జనాలకు చేరడం కష్టమని ఆయన చాలా వేగంగా గ్రహించారు. అందుకు తగ్గట్లుగా ఆయన జాతీయతావాద బాకాను నిర్మించడాన్నే తన వ్యాపారంగా చేసుకున్నారు. ఫలితంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూపు ఎనిమిది భాషల్లో దేశవ్యాప్తంగా అనేక ఎడిషన్‌లను కలిగినదిగా వృద్ధి చెందింది.

కాంగ్రెస్‌ 1969లో చీలిపోయిన తరువాత, ఆయన ఆ పార్టీకి దూరంగా జరిగారు. ఆయన ఆ తరువాత జయప్రకాశ్‌ నారాయణ్‌ చేపట్టిన బిహార్‌ ఉద్యమాన్ని బలపరిచారు. ఆర్థికంగా ఆదుకున్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ మొత్తం అధికార యంత్రాంగాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఉసిగొల్పినప్పటికీ ఆయన ఏ మాత్రం లొంగలేదు. ఆనాటి గోయెంకా అసామాన్య పోరాట పటిమ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆయనను మనం ప్రేమించవచ్చు. లేదా ద్వేషించవచ్చు. అభిమానించవచ్చు లేదా అయనను చూసి భయపడవచ్చు. కానీ రామ్‌నాథ్‌ గోయెంకా గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉండలేం. అంతేకాదు స్వర్గీయ బి. జి. వర్ఘీస్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు 1982–1986 మధ్య ఎడిటర్‌.ఽ

(చదవండి: చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి)

మరిన్ని వార్తలు