ఇండియా@75: భారత్‌కు తొలి మహిళా రాష్ట్రపతి

31 Jul, 2022 09:39 IST|Sakshi

ప్రతిభా పాటిల్‌ భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. 2007 జూలై 25న ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు వరకు రాజస్థాన్‌ గవర్నరుగా (2004–2007) ఉన్నారు. యునైటెడ్‌ ప్రొగ్రెస్సెవ్‌ ఆలియన్స్‌ (యు.పి.ఎ) పాటిల్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. యు.పి.ఎ మొదట ప్రతిపాదించిన శివరాజ్‌ పాటిల్‌ లేదా కరణ్‌ సింగ్‌ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించకపోవడంతో పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు.

పాటిల్‌ భారత జాతీయ కాంగ్రెస్‌కు, నెహ్రూ గాంధీ కుటుంబానికి అనేక దశాబ్దాల పాటు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందు వల్ల కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ ఆమెను ఎంపిక చేశారు. పాటిల్‌ తన ప్రత్యర్థి భైరాన్‌ సింగ్‌ షెకావత్‌పై భారీ మెజారిటీ గెలిచారు. ప్రతిభా పాటిల్‌ 1934లో మహారాష్ట్రలోని నందగావ్‌లో జన్మించారు. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ముఖ్యాంశాలుగా డబల్‌ ఎమ్‌.ఎ. చేశారు. టేబుల్‌ టెన్నిస్‌లో రాణించిన క్రీడాకారిణి కూడా. 1962లో ప్రతిభా పాటిల్‌ ఎం.జె.కళాశాల ‘కాలేజ్‌ క్వీన్‌‘గా కూడా ఎన్నికయ్యారు! ఉన్నత విద్యాభాసం తర్వాత భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక అంశాలపై ఆసక్తిని ఏర్పరచుకున్నారు. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు 

  • ఒ.పి.నయ్యర్, ధూళిపాళ సీతారామశాస్త్రి, రామచంద్ర గాంధీ, ప్రధాని చంద్రశేఖర్, ఎస్‌.ఆర్‌. బొమ్మయ్, జి.పి.సిప్పీ.. కన్నుమూత.
  • హైదరాబాద్‌లో మే నెలలో మక్కా మసీదు వద్ద బాంబు పేలుళ్లు. 9 మంది దుర్మరణం. హైదరాబాద్‌లోనే తిరిగి ఆగస్టు నెలలో బాంబు పేలుళ్లు. 42 మంది దుర్మరణం.

(చదవండి: సామ్రాజ్య భారతి: 1916/1947)

మరిన్ని వార్తలు