మణిపుర్-త్రిపుర-మేఘాలయ
మణిపుర్, త్రిపుర, మేఘాలయలు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. 1947లో మణిపుర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపుర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపుర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు. 1949లో మణిపుర్ రాజ్యం భారతదేశంలో విలీనం అయింది. 1956 నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మణిపుర్ 1972లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. త్రిపుర కూడా భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఒక రాజ్యంగా ఉండేది. 1949 లో భారత్లో విలీనమయ్యే వరకు గిరిజన రాజులు త్రిపురను శతాబ్దాలుగా పరిపాలిస్తూ వచ్చారు.
చదవండి: చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి
రాచరిక పాలనకు వ్యతిరేకంగా గణముక్తి పరిషద్ ఉద్యమం ప్రారంభమైనది. ఈ ఉద్యమ ఫలితమే త్రిపుర భారతదేశంలో విలీనం అవడం. దేశ విభజన తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రంలో ఇప్పుడు బెంగాలీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయం పొందినవారే), స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనం సాగిస్తున్నారు. త్రిపుర 1972లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. మేఘాలయ 1972 ముందు వరకు అస్సాంలో భాగంగా ఉండేది. మణిపుర్, త్రిపురలతో పాటు ప్రభుత్వం 1972 జనవరి 21 మేఘాలయకు రాష్ట్ర ప్రతిపత్తిని ఇచ్చింది.