చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్‌ బూర్కి వైట్‌

12 Aug, 2022 12:48 IST|Sakshi

1904–1971

1947లో జరిగిన భారత విభజన మానవాళి చరిత్రలో ఒక మహా విషాదం. కోటీ యాభయ్‌ లక్షల నుంచి రెండు కోట్ల మంది పాకిస్థాన్‌ నుంచి భారత్‌ కూ, భారత్‌ నుంచి పాకిస్థాన్‌కూ తరలిపోయారు. ఇరవైరెండు లక్షల మంది ఆచూకీ దొరకలేదు. ఈ రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్‌ బూర్కి–వైట్‌. ‘గ్రేట్‌ కలకత్తా కిల్లింగ్స్‌’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్‌ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు.

మార్గరెట్‌ అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్‌ జాతీయురాలు. తండ్రి జోసెఫ్‌ వైట్‌ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్‌ జాతీయురాలు. మార్గరెట్‌ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు.  ప్రఖ్యాత ‘టైమ్‌’ మ్యాగజైన్‌ యజమాని హెన్రీ లూస్‌ ‘లైఫ్‌’ పేరుతో ఒక పత్రికను వెలువరించాలని ఏర్పాటు చేసుకున్నారు.

అప్పుడే మార్గరెట్‌ను ఆ పత్రికకు ఎంపిక చేశారు. ఆమె లైఫ్‌లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌.  రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్‌. అప్పుడే క్రెమ్లిన్‌ (రషా) మీద నాజీ సేనలు దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్‌.

తన ఫొటో తీయడానికి స్టాలిన్‌ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్‌ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్‌ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. ఇక మనదేశానికైతే కేవలం మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్‌ వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్‌ తీశారు. ఇంకా చాలా పోజులలో ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశంలో తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్‌ వంటి చరిత్ర పురుషుల పోర్టెయ్రిట్‌లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి.

అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్‌ తన కెమెరాతోను, లీ ఐటింగన్‌ డైరీ కలంతోను ఆ దారుణ దృశ్యాలకు శాశ్వతత్వం కల్పించారు. మార్గరెట్‌ విభజన విషాద చిత్రాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఆమె మాత్రం పార్కిన్సన్‌ పెయిన్‌ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్‌  హింసాత్మక భారతావనిని చూడటం ఒక వైచిత్రే.

మరిన్ని వార్తలు