శతమానం భారతి: అభివృద్ధి వెంటే అనర్థమూ.. భూతాపమూ అలాంటిదే!

9 Jun, 2022 12:25 IST|Sakshi

అభివృద్ధి వెంటే అనర్థమూ ఉంటుంది. భూతాపం అలాంటి అనర్థమే. ప్రస్తుతం భూమి ఉష్ణోగ్రత 13.9 సెల్సియస్‌ డిగ్రీలు. ఈ వేడిమి కనుక ఇంకో 1.5 డిగ్రీలు పెరిగితే మనం ఇంకో గ్రహం వెతుక్కోవలసిందే. అంతకన్నా తేలికైన పని.. అభివృద్ధిని ఎలాగూ ఆపుకోలేం కనుక.. అనర్థాలను తగ్గించుకోవడం. స్కాట్లాండ్‌లోని గ్లాస్కోలో గత ఏడాది ‘కాప్‌ 26’ సదస్సు జరిగింది ఇందుకే. 

అందులో మన దేశం కూడా పాల్గొంది. కాప్‌ అంటే ‘కాన్ఫరెన్సెస్‌ ఆఫ్‌ పార్టీస్‌’. 26 అంటే ఇరవై ఆరవ సదస్సు అని. వాతావరణ మార్పుల నిరోధానికి 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా మళ్లీ  2015లో ప్యారిస్‌లో ఒక ఒప్పందం జరిగింది. కర్బన ఉద్గారాలు తగ్గించగలిగితే భూమి వేడినీ తగ్గించవచ్చని సమితి ఆలోచన. 2050 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గిస్తానని భారత్‌ ఆ సదస్సులో మాటైతే ఇచ్చింది కానీ, ఎలా తగ్గించాలనేదే పెద్ద సమస్య. 

భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం అంటే అభివృద్ధిని తక్కించుకోవడమే. అయినా భూమి కంటే అభివృద్ధి ముఖ్యం కాదు కదా. కూర్చున్న కొమ్మను కాపాడుకుంటేనే మనుగడ అనే సత్యాన్ని స్వతంత్ర భారత్‌కు తెలియంది కాదు. అందుకనే నిర్ణయాత్మకంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి ఆ అడుగులు భూతాపాన్ని తగ్గించే దిశగా దేశాన్ని ఎక్కడి వరకు చేరుస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు