ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా కొన్ని సంగతులు...

15 Aug, 2022 19:21 IST|Sakshi

►1947, ఆగస్ట్‌ 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో మునిగి ఉంటే గాంధీ మాత్రం ఆ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. బెంగాల్లో చెలరేగిన మతకలహాలకు నిరసనగా నిరహార దీక్ష చేస్తూ.

►రవీంద్రనాథ్‌ టాగోర్‌ ‘జనగణ మన’ను 1911లో రచించారు. అది జాతీయ గీతంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950, జనవరి 24 నుంచి. రవీంద్రుడే రాసిన (1905) ‘అమోర్‌ సోనార్‌ బంగ్లా’లోని మొదటి పదిలైన్లను తీసుకొని బంగ్లాదేశ్‌ తన జాతీయ గీతంగా పాడుకుంటోంది. అంతేకాదు శ్రీలంక జాతీయ గీతమైన ‘శ్రీలంక మాతా’ గీతానికి, స్వరకల్పనకూ రవీంద్రనాథ్‌ టాగోర్‌ సాహిత్యం, సంగీతమే స్ఫూర్తి. 

►స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1973 వరకు ఆగస్ట్‌ 15న గవర్నర్లే ఆయా రాష్ట్రాల్లో జెండా వందనం చేసేవారు. ఈ పద్ధతిని కాదని ఆగస్ట్‌ 15న ముఖ్యమంత్రులే జెండా వందనం చేయాలనే కొత్త సంప్రదాయాన్ని సూచించింది ఎమ్‌. కరుణానిధి.. 1974లో.

►ప్రతి ఆగస్ట్‌ 15న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తే బాగుంటుందని.. ఈ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారట. ఆ ప్రతిపాదనను  ఆమె ప్రభుత్వం ఒప్పుకుంటూ 1974 నుంచి అమల్లోకి తెచ్చింది. 

►మన జాతీయ పతాకం తయారయ్యేది ఒకే ఒక్క చోట. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఉన్న ‘కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగసంయుక్త సంఘ (కేకేజీఎస్సెస్‌)’లో తయారయ్యి దేశమంతా పంపిణీ అవుతుంది. అదీ బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) నిర్ధారించిన ప్రమాణాల్లో.

మరిన్ని వార్తలు