లక్షకే కారు.. నానో జోరు

1 Aug, 2022 18:09 IST|Sakshi

మోటర్‌సైకిళ్లు, స్కూటర్‌లు నడిపేవారికి సైతం అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటర్స్‌ కంపెనీ ‘నానో’ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మొత్తం అంతా కలిపి లక్ష రూపాయలకే చేతి కొచ్చే ఈ కారును కొనేందుకు భారత ప్రజలు ఉత్సాహం చూపారు. ఏడాదికి 2,50,000 కార్లు విక్రయించాలని టాటా మోటర్స్‌ లక్ష్యం పెట్టుకుంది. అయితే ఫ్యాక్టరీని రాజకీయ కారణాల వల్ల పశ్చిమబెంగాల్‌లోని సింగూరు నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు మార్చవలసి రావడంలో జరిగిన జాప్యం కారణంగా లక్ష్యాన్ని సాధించలేక పోయింది.

అంత తక్కువ ధర గల కారు సురక్షితం కాదేమోనని వినియోగదారులు భావించడం కూడా నానో విక్రయాలు మందగించడానికి ఒక కారణం అయింది. అయినప్పటికీ రతన్‌ టాటాకు ఈ బ్రాండ్‌తో ఉన్న సెంటిమెంటు వల్ల 2017 వరకు బండిని లాక్కొచ్చారు. సనంద్‌ ఫ్యాక్టరీ ఇప్పుడు టియాగో, టైగర్‌ బ్రాండ్‌ రెగ్యులర్‌ కార్లను ఉత్పత్తి చేస్తోంది. వాటి ధర సుమారు 6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ నానో కారు నడిపేవారు రోడ్లపై కనిపిస్తారు కానీ, నానో కారు ఉత్పత్తులు 2018లోనే ఆగిపోయాయి.  

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్, బాబా ఆమ్టే, రఘువరన్, శ్యామ్‌ మానెక్షా, మహేంద్ర కపూర్, వి.పి.సింగ్‌ కన్నుమూత.
  • జైపూర్‌లోని మోతీ డూంగ్రీ ఫోర్ట్‌ వద్ద ల్యాండ్‌ మాఫియాకు వ్యతిరేకంగా తన 88 ఏళ్ల వయసులో ధర్నాకు కూర్చున్న జైపూర్‌ రాజమాత గాయత్రీదేవి.
  • హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో తొక్కిసలాట. 162 మంది మృతి. 
  • ముంబైలో నవంబర్‌ 26 నుంచి 29 మధ్య పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద బాంబు పేలుళ్లు. 175 మంది పౌరులు దుర్మరణం. 

(చదవండి: మహోజ్వల భారతి: బ్రిటిష్‌ సామ్రాజ్యంలో బానిసత్వ నిషేధం)

మరిన్ని వార్తలు