ఇండియా@75: వీరప్పన్‌ హతం

28 Jul, 2022 09:20 IST|Sakshi

తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులకు కొన్ని ఏళ్లపాటు కంట కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. పోలీస్‌ ఆఫీసర్లు, ఫారెస్టు అధికారులతో సహా సుమారు 185 మందిని నిర్దాక్షిణ్యంగా చంపిన నేర చరిత్ర వీరప్పన్‌ది. పోలీసుల రికార్డుల ప్రకారం దంతాల కోసం వీరప్పన్‌ 2 వేలకు పైగా ఏనుగుల్ని మట్టుపెట్టాడు. 143 కోట్ల రూపాయల విలువ చేసే గంధపు చెక్కల్ని కొల్లగొట్డాడు.

16 కోట్ల రూపాయల విలువైన ఏనుగు దంతాల్ని స్మగ్లింగ్‌ చేశాడు. చివరికి వీరప్పన్‌ని, వీరప్పన్‌ అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ‘ఆపరేషన్‌ కుకూన్‌’ పేరుతో ప్రణాళికను రచించింది. ఈ ఆపరేషన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయకుమార్‌ నాయకత్వంలో సాగింది. 1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్‌ 2004 అక్టోబర్‌ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చి చంపడంతో ముగిసింది. ఇది దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖరీదైన ఆపరేషన్‌ గా నిలిచింది. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
పెప్సీ విస్తరణ ప్రాజెక్టును తిరస్కరించిన ‘మహారాష్ట్ర పొల్యూషన్‌  కంట్రోల్‌ బోర్డు’ 
దేశ ప్రధానిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌.
ఐక్య ప్రగతిశీల కూటమి (యు.పి.ఎ.) ప్రభుత్వం ఏర్పాటు. 
ఆలయ మేనేజర్‌ను హత్య చేశారన్న ఆరోపణపై కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్ట్‌. 

(చదవండి: ఆరు చొక్కాలు.. నాలుగు ప్యాంట్లు.. ఒక జత షూ)

మరిన్ని వార్తలు