బిన్నీ మిల్స్‌ సమ్మె

20 Jun, 2022 08:48 IST|Sakshi

1920లలో మద్రాసులో బి అండ్‌ సి మిల్లుగా ప్రసిద్ధి చెందిన బకింగ్‌హామ్‌ అండ్‌ కర్నాటిక్‌ మిల్స్‌లో పని చేసే కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చిన రోజు ఇది (జూన్‌ 20, 1921). ఆ ఏడాది జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు సాగిన కార్మికుల సమ్మె కారణంగా.. ఆ మిల్లు మాత్రమే కాకుండా, మొత్తం మద్రాసు ఆర్థిక పరిస్థితే దెబ్బతింది! జీతాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ కంపెనీ స్పిన్నింగ్‌ విభాగంలోని కార్మికులు మొదట మే 20న అకస్మాత్తుగా పని ఆపేశారు.

యాజమాన్యం వారి డిమాండ్లకు తలొగ్గకపోవడంతో సరిగ్గా నెల రోజులకు సమ్మెను అధికారికంగా ప్రకటించారు. వారి సమ్మెకు కాంగ్రెస్‌ నాయకుడు కల్యాణసుందరం మొదలియార్‌ నాయకత్వం వహించారు. కార్మికులు దిగిరాకపోవడంతో మిల్లు అధికారులు నిర్దయగా వ్యవహరించారు. పోలీసులను పిలిపించారు. కార్మికులు ఆగ్రహావేశాలకు లోనయారు. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు కార్మికులు మరణించారు.

నాటి జస్టిస్‌ పార్టీ, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా కలిసి కార్మికుల పక్షాన నిలిచారు. చివరికి ద్రవిడ ఉద్యమనేత నటేష మొదలియార్‌ మధ్యవర్తిత్వంతో సమ్మె ముగిసింది. అయితే ఎంపిక చేసిన కొంత మంది కార్మికులను మాత్రమే యాజమాన్యం తిరిగి పనిలోకి తీసుకుంది. 1996లో మిల్లు మూతపడింది. ప్రస్తుతం అక్కడ సినిమా షూటింగులు జరుగుతున్నాయి. 

(చదవండి: శతమానం భారతి విదేశీ వాణిజ్యం)

మరిన్ని వార్తలు