భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు

21 Oct, 2022 06:23 IST|Sakshi

ఆన్‌లైన్‌లో ప్రారంభించిన వీహెచ్‌పీ

న్యూఢిల్లీ: తమ యువజన విభాగం భజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో భజరంగ్‌ దళ్‌ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్‌సైట్‌ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని గురువారం వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరాండే మీడియాతో అన్నారు.

కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్‌ 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్‌) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు