6 అడుగుల ఎత్తు.. 100 కిలోల బరువు.. ధర రూ.20కోట్లు.. శునకాన్ని చూసేందుకు ఎగబడ్డ జనం..

23 Jan, 2023 13:19 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో నిర్వహించిన బల్లారి ఉత్సవ్‌లో ఓ శునకాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఎందుకంటే ఇది మామాలు శునకం కాదు. దేశంలోనే అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క. దీని ధర రూ.20కోట్లు. కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకం యజమాని బెంగళూరు వ్యాపారవేత్త సతీశ్. దీన్ని కొనేందుకు ఇటీవల కొందరు కళ్లు చెదిరే ధర ఆఫర్ చేసినా ఇతను తిరస్కరించాడు. 

ఈ శునకానికి కెడబామ్ హైదర్ అని పేరు పెట్టాడు సతీష్. దీని వయసు 14 నెలలు. నిలబడితే 6 అడుగుల ఎత్తు ఉంటుంది. బరువు దాదాపు 100 కిలోలు. దీన్ని పోషించేందుకు రోజుకు రూ.2,000 ఖర్చు చేస్తున్నాడు. బల్లారి ఉత్సవ్‌లో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి దీన్ని ఏసీ కారులో తీసుకెళ్లాడు.

ఖరీదైన జాతులు..
ఇదే కాదు సతీష్ వద్ద మరో రెండు అరుదైన శునకాల జాతులు కూడా ఉన్నాయి. రూ.కోటి  ధర ఉన్న కొరియన్ డొసా మస్టిఫ్, అలాగే రూ.8 కోట్ల ధర పలికే అలస్కన్ మలమ్యూట్ బ్రీడ్ శుకనం కూడా ఉంది. తన వద్ద కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు కూడా ఉన్నాయని, ఒక్కోదానికి రూ.5 కోట్లు ఇచ్చి కొంటామని ఆపర్లు వస్తున్నాయని సతీష్ పేర్కొన్నాడు. 

బల్లారి ఉత్సవాలు జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగాయి. నిర్వాహకులు ఇక్కడ శునకాల పోటీలు నిర్వహించారు. 50 రకాల బ్రీడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. సతీష్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన కాకేసియన్ షెఫర్డ్‌తో వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. దీంతో ఈ అరుదైన శునకాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.

చదవండి: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...

మరిన్ని వార్తలు