Bangalore: కోటి వాహనాల ఐటీ సిటీ

11 May, 2022 09:07 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సొంత వాహనాలపై ఏటేటా మక్కువ పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న వాహన రిజిస్ట్రేషన్లే దానికి నిదర్శనం. ఫలితంగా రోడ్లు చాలక మొత్తం నగరవాసులు ఇబ్బందులను అనుభవిస్తున్నారు.  ప్రస్తుతం బెంగళూరు జనాభా 1.30 కోట్లుగా ఉంది. వాహనాల సంఖ్య కూడా సుమారు కోటికి చేరుకుంది. నగరంలో ప్రస్తుతం బైకులు, కార్లు, బస్సులు, ఇతరత్రా రవాణా వాహనాల సంఖ్య 1,03,21,000గా ఉంది. కిక్కిరిసిన వాహనాల ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడా ఎగబాకుతోంది.  

68 లక్షల బైక్‌లు, 21 లక్షల కార్లు  
 2022, మే వరకు రాజధానిలో రిజిస్టర్‌ అయిన వాహనాల సంఖ్య చూస్తే 68,72,763 బైకులు, 21,74,830 కార్లు, 1,15,000 ట్రక్కులు, లారీలు, 3,50,000 ట్యాక్సీ, ఆటోలు, 8,08,990, ఇతర వాహనాలు ఇలా మొత్తంగా 1,03,21,583 వాహనాలు బెంగళూరు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత వాహన ఒత్తిడిని తట్టుకోలేని రోడ్లు తరచూ నాశనమవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్‌ రద్దీ జన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కిలోమీటరు దూరంలోని గమ్యం చేరడానికి పీక్‌ అవర్స్‌లో రెండు మూడు గంటలు పడుతోంది. 

చాలీచాలని రహదారులు  
బీబీఎంపీ పరిధిలో మొత్తం 1,1940 కిలోమీటర్ల పొడవునా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు 60 లక్షల వాహనాలను మాత్రం భరించగలవు. కానీ కోటికి పైగా వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల రోడ్ల నాణ్యత దెబ్బతింటోంది. మరోవైపు నగరంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు కార్‌పూలింగ్‌ను అమలు చేయాలని, పార్కింగ్‌ స్థలం ఉన్న ఇళ్లవారికే కారు కొనుగోలు నిబంధన ఉండాలని డిమాండ్లు ఉన్నాయి.

చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో..

మరిన్ని వార్తలు