ఛత్తీస్‎ఘడ్‎: ఎస్పీ తలకు గాయాలు.. నారాయణ్‎పూర్‎లో హైటెన్షన్‌

3 Jan, 2023 12:09 IST|Sakshi
నారాయణపూర్‌లో ఉద్రిక్త వాతావరణం(ఇన్‌సెట్‌లో గాయపడ్డ ఎస్పీ)

రాయ్‌పూర్‌: ఛత్తీస్‎ఘడ్‎ బస్తర్‌ జిల్లా నారాయణ్‎పూర్‎లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివాసీలు ఆగ్రహంతో సోమవారం పోలీసులపై దాడికి దిగారు. అంతకు ముందు ఓ సున్నితమైన అంశానికి సంబంధించి దాడి చేసేందుకు ప్రయత్నించారు వాళ్లు. ఈ క్రమంలో.. పోలీసులు వాళ్లను అడ్డుకుని వాళ్లతో మాట్లాడేందుకు తయ్నించారు. అయితే ఉన్నట్లుండి ఆదివాసీలు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  

ఆదివాసీలు చేసిన రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీ సదానంద కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయన తల పగలి రక్తస్రావం అయ్యింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

ఇక ఘటనపై చత్తీస్‌గఢ్‌ హోం మంత్రి తమ్రాజ్‌వాద్‌ సాహూ స్పందించారు. పోలీసులు శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు యత్నించినా.. ఆదివాసీలు దాడికి దిగారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీపై వెనుక నుంచి దాడి చేశారని వెల్లడించారు.

గత కొన్నాళ్లుగా ఆదివాసీల మధ్య చిచ్చు రగులుతోంది అక్కడ. రెండు వర్గాలుగా చీలిపోయిన ఆదివాసీలు.. గత రెండు నెలల్లో దాదాపు 20సార్లు ఘర్షణలకు దిగారు. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్‌ రంగంలోకి దిగారు.

మరిన్ని వార్తలు