కలకలం: బదిలీ చేశారని విషం తాగిన గవర్న్‌మెంట్‌ టీచర్లు

25 Aug, 2021 17:48 IST|Sakshi

కలకత్తా: తమను అకారణంగా దూర ప్రాంతాలకు బదిలీ చేశారని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఆందోళనను తీవ్ర రూపం చేసేందుకు వారు విషం సేవించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. విషం తాగిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటనతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్‌ రిలీఫ్‌)

మాధ్యమిక శిక్ష కేంద్ర (ఎంఎస్‌కే), శిశు శిక్ష కేంద్ర (ఎస్‌ఎస్‌కే)లో కాంట్రాక్ట్‌ టీచర్లు పని చేస్తున్న వారిని సుదూర ప్రాంతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని పాఠశాల విద్యా శాఖ కార్యాలయం (బికాశ్‌ భవన్‌)ను మంగళవారం బదిలీ జరిగిన కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు ముట్టడించారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. మంత్రికి నిరసనగా నినాదాలు చేశారు.

ఈ సమయంలో టీచర్లు కార్యాలయంలో ఉన్న మంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు విషం సేవించారు. విష ద్రావణం సేవించడంతో టీచర్లు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురు టీచర్లు షికాస్‌ దాస్‌, జ్యోత్స్న తుడు, పుతుల్‌ జనా, చబీదాస్‌, అనిమానాథ్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్‌ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా
 

మరిన్ని వార్తలు