నెంబర్‌ 1 గా నిలిచిన బెంగళూరు

28 Jun, 2021 05:57 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ సిటీ బెంగళూరు దేశంలో నివాసయోగ్య నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌– 2020 ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆహ్లాదరకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, విస్తరిస్తున్న ఐటీ రంగం తదితరాలతో ఈ హోదాను సొంతం చేసుకుంది.  

తరువాతి స్థానాల్లో చెన్నై, సిమ్లా  
విజ్ఞాన, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) విడుదల చేసిన నివాసయోగ్యాల నగరాల జాబితాలో బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై, సిమ్లా, భువనేశ్వర్, ముంబై నిలిచాయి. ఢిల్లీ ఆరోస్థానంలో నిలవడమే కాకుండా ఆర్థిక సామర్థ్యంలోనూ చాలా వెనుకబడి ఉంది. మొత్తం ఐదు విభాగాల్లో సీఎస్‌ఈ అధ్యయనం జరిపి ర్యాంకింగులను ప్రకటించింది. నాణ్యమైన జీవన ప్రమాణాల్లో 60.84 శాతం మార్కులతో చెన్నై తొలిస్థానం, 55.67 శాతం మార్కులతో బెంగళూరు రెండో స్థానం, భోపాల్‌ మూడో స్థానంలో నిలిచాయి.

ఇక ఆర్థిక సామర్థ్యం అంశంలో బెంగళూరు టాప్‌లో నిలిచింది. 100కు 78.82 శాతం మార్కులు లభించాయి. బెంగళూరుకు సమీపంలో మరే ఇతర నగరం కూడా లేకపోవడం విశేషం. బెంగళూరు తర్వాత ఢిల్లీకి రెండో స్థానం (50.73 శాతం) దక్కింది.
 

మరిన్ని వార్తలు