రెండు రోజులుగా ఆకలితో.. అమ్మ, సోదరుడి శవాల పక్కనే

13 May, 2021 15:29 IST|Sakshi
బాధితులు ( కర్టసీ:ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా)

బెంగళూరులో  విషాదం

మృతదేహాల పక్కనే  ఆకలితో అలమటిస్తూ మతిస్తిమితం లేని మహిళ 

బెంగళూరు: బెంగళూరులో షాకింగ్‌ ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలియక తల్లీ, సోదరుడి మృతదేహాల పక్కనే  మతిస్థిమితింలేని ఒక మహిళ  రెండు రోజుల  పాటు ఆకలితో అలమటిస్తూ గడిపిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ ఇంటినుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. దీంతో గురువారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం  రాజేశ్వరి నగర్‌లో  నివసించే ప్రవీణ్‌  తన ఇంటి యజమాని ఇంటినుంచి వాసన వస్తోందని పోలీసులను తెలిపాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. ముందు గదిలోఒకటి, తరువాతి గదిలో మరొకి, మొత్తం రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండగా గుర్తించారు. వీరిని అర్యాంబ (65), హరీష్‌(45)గా గుర్తించారు. మరో మహిళ శ్రీలక్షి(47) ప్రాణాలతో ఉంది. వీరు మరణించారని తెలియని ఈమె ఆకలితో అలమటిస్తూ ఇంట్లోనే గడిపిందని పోలీసులు తెలిపారు. ఈమె మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించి,  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు.  దర్యాప్తు  ప్రారంభించామని పోలీసుల ఉన్నతాధికారి సంజీవ్‌ పాటిల్‌ వెల్లడించారు.

అమ్మ నిద్రపోతోందనుకున్నా, లేచి అన్నం పెడుతుందని చూస్తున్నా.
మరోవైపు అమ్మ నిద్రపోతోందనుకున్నానని, లేచి అన్నం వండి పెడుతుందని చూస్తున్నాం.. రోజూ  అమ్మే వంట చేస్తుందని, రెండు రోజులుగా ఏమీ  తినలేదని శ్రీలక్ష్మి పోలీసులకు తెలిపింది. రెండు రోజుల క్రితం అమ్మ కిందపడిపోతే,హరీష్‌ చాలాసార్లు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడని అయినా ఎవరూ రాలేదని తెలిపింది. ఆ తరువాత అతను కూడా పడిపోయాడని  విచారణలో వెల్లడించింది.  సోమవారం ఉదయం హరీష్‌ 108కు పలు సార్లు ఫోన్‌ చేసినట్టుగా అతని కాల్‌రికార్డు ద్వారా పోలీసులు గుర్తించారు. ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నహరీష్‌ తల్లి, పెళ్లి కాని అక్క శ్రీలక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. గత నెల ఏప్రిల్‌ 22న   అతనికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతను హోంసోలేషన్‌లో ఉన్నాడు.  ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. 

చదవండి: కరోనా: సీనియర్‌ వైద్యుల మూకుమ్మడి రాజీనామా

>
మరిన్ని వార్తలు