‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌.. మాజీ గవర్నర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

20 Feb, 2023 21:17 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేనకు చెందిన విల్లుబాణం గుర్తుపై రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే.. సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కాగా, దీనిపై తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు.

అయితే, కోష్యారీ ఇండియా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. తమకు మెజార్టీ ఉందని షిండే, ఫడ్నవీస్‌ చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే రాజ్ భవన్‌లో కార్యక్రమం జరిగింది. అంతే తప్ప గవర్నర్‌గా నా పాత్ర ఏమీ లేదన్నారు. అలాగే.. ఇదే సమయంలో ఉద్ధవ్‌ థాక్రే తనకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తన వద్దకు రాలేదన్నారు. ఏమీ మాట్లాడలేదు.

దీంతో, మరో పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. చేసింది. రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రఫుల్ పటేల్, శరద్ పవార్, ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ నేతలు)ను అడిగాను. అయినా ఒక్కరు కూడా.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉందని లేఖ ఇవ్వలేదు. శివ సైనికుడిని సీఎం చేయాలని అనుకుంటున్నామని మాత్రం చెప్పుకుంటూ వచ్చారంతే అని కోష్యారీ వివరించారు. ఇక, కోష్యారీ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. శివసేన రెండుగా చీలిపోవడం ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల కమిషన్‌ కూడా శివసేన అధికారిక గుర్తు.. విల్లుబాణంను షిండే వర్గానికే కేటాయించింది. 

మరిన్ని వార్తలు