భారత్‌ బంద్‌: వ్యవసాయ బిల్లులపై రైతుల ఆగ్రహం

25 Sep, 2020 11:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల యూనియన్లు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.  రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుతో పలు రాష్ట్రాలలో రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు.  దేశవ్యాప్తంగా బంద్‌కు మద్దతుగా..  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రవిడ మున్నేట్రా కగం, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ సహా 18 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన యూనియన్లలో భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), అఖిల భారత రైతు సంఘం (ఎఐఎఫ్‌యు), అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్‌సిసి), అఖిల భారత కిసాన్ మహాసంఘ్ (ఎఐకెఎం) ఉన్నాయి. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే)

పంజాబ్‌లో బంద్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దును కూడా మూసివేసే అవకాశం ఉంది. అయితే పంజాబ్, హర్యానాల్లో 31 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గత నాలుగు రోజుల నుంచి ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం రోజున పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ పూర్తిగా షట్‌డౌన్‌ చేయనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ టకైట్‌ తెలిపారు. కాగా.. పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను  తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నేడు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవసాయబిల్లులతో చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు