కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్‌

21 Apr, 2021 15:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫార్‌ మెడికర్‌ రీసెర్చి(ఐసీఎంఆర్‌) బుధవారం ప్రకటించింది. కరోనా కొత్తరకం వైరస్‌ను కూడా కొవాగ్జిన్‌ అడ్డుకుంటుందని పేర్కొంది. విజయవంతంగా యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను బంధించి కల్చర్‌ చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్‌ నిలువరిస్తోందని వెల్లడించింది. కోవిడ్‌ టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్‌ బయోటెక్‌ ఛైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌‌ కృష్ణ ఎల్లా వెల్లడించారు.

అయితే టీకా తీసుకున్నా మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని డాక్టర్‌‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. టీకా తీసుకున్న వారికి కూడా కోవిడ్‌ వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ ఛైర్మెన్‌ స్పందించారు. వ్యాక్సిన్‌ కేవలం ఊపిరితిత్తుల కింది భాగాన్ని రక్షిస్తుందని, పై భాగాన్ని కాదని తెలిపారు. అందుకే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే కరోనా వచ్చినా కూడా ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని వెల్లడించారు.

ఉత్పత్తిని పెంచుతున్నాం
కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచనున్నామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఏటా 70 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకోసం హైదరాబాద్‌, బెంగళూరులోని తమ ప్లాంట్లను దశలవారీగా విస్తరిస్తున్నట్లు మంగళవారం వివరించింది.

చదవండి: కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం

మరిన్ని వార్తలు