భారీగా తగ్గిన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధరలు

30 Apr, 2021 06:17 IST|Sakshi

కోవాగ్జిన్‌ రూ. 200 తగ్గింపు

రాష్ట్రాలకు రూ. 400లకు అమ్ముతాం: భారత్‌ బయోటెక్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ తమ కోవిడ్‌ టీకా ‘కోవాగ్జిన్‌’ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసును రూ.600గా ఇదివరకు నిర్ణయించిన భారత్‌ బయోటెక్‌ దాన్ని రూ.400కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్రానికి  రూ.150 డోసు చొప్పున అందజేస్తున్న ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు అధిక ధరను నిర్ణయించడంపై విమర్శలు రావడం తెల్సిందే. ‘రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్‌ను రూ.400లకు డోసు చొప్పున అమ్మాలని నిర్ణయించాం’ అని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

సీరమ్‌ తమ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధరను రూ.100 తగ్గించి రాష్ట్రాలకు రూ.300లకు డోసు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. ధర తగ్గించిన తర్వాతా.. కోవిషీల్డ్‌తో పోల్చితే కోవాగ్జిన్‌ ధర ఇంకా రూ.100 ఎక్కువే ఉండటం గమనార్హం. 18–44 ఏళ్ల వయసు వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించిన కేంద్రం దీనికి అవసరమైన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయాలది. సీరమ్, భారత్‌ బయోటెక్‌లు ప్రైవేటు ఆసుపత్రులకు అందించే టీకా ధరలను (ప్రతిడోసుకు) వరుసగా రూ.600, రూ1,200లుగా నిర్ణయించాయి.

>
మరిన్ని వార్తలు