Covaxin అనుమతులకై జూన్‌ 23న డబ్ల్యూహెచ్‌ఓతో భేటీ

17 Jun, 2021 12:35 IST|Sakshi

ఈనెల 23న డబ్ల్యూహెచ్‌ఓతో భేటీ కానున్న భారత్‌ బయోటెక్‌

న్యూఢిల్లీ: కోవాగ్జిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు కోసం భారత్‌ బయోటెక్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అవసరమైన పత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. అనుమతుల విషయమై డబ్ల్యూహెచ్‌ఓతో ఈ నెల 23న సమావేశం కానున్నట్లు తెలిపింది. అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌) కోసం అవసరమైన 90శాతం డాక్యుమెంట్లను గతంలోనే సమర్పించినట్లు కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందజేయాల్సి ఉంది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్‌ బయోటెక్‌తో సమన్వయం చేస్తోంది. ఇండియన్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. 

ఇక భారత్‌లో అత్యవసర వినియోగం పొందిన మూడు కోవిడ్‌ టీకాల్లో కోవాగ్జిన్‌ ఒకటి. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ డ్రైవ్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి టీకా వేసింది. ఇక మార్చిలో ప్రారంభించిన రెండో దశ టీకా క్యాక్రమంలో భాగాంగా 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఏప్రిల్‌ 1న మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. 

చదవండి: Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్‌ బయోటెక్‌

మరిన్ని వార్తలు