భద్రత మధ్య జోడో యాత్ర

23 Jan, 2023 05:39 IST|Sakshi

సాంబా (జమ్మూకశ్మీర్‌): జమ్ములో జంటపేలుళ్ల నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పాదయాత్రకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆదివారం ఉదయం కథువా నుంచి  ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర మధ్యాహ్నానికి  సాంబా జిల్లాలోని చక్‌ నానక్‌కు చేరుకుంది. షెడ్యూల్‌ ప్రకారమే రాహుల్‌ పాదయాత్ర అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది.సోమవారం మధ్యాహ్నానికి రాహుల్‌ గాంధీ జమ్ము చేరుకుంటారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ చెప్పారు. రాహుల్‌ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న ఆయన ఈ యాత్రతో బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.  

విద్వేషాలు సృష్టిస్తున్నారు: రాజ్‌నాథ్‌
రాహుల్‌ గాంధీ అధికారం కోసం ప్రజల్లో విద్వేషాలను సృష్టిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. రాహుల్‌ వల్ల అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ప్రజాభిమానం, నమ్మకం పొందడం ద్వారానే అధికారం లభిస్తుందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు