వైరల్‌ వీడియో: వేరే స్టాప్‌తో టికెట్‌.. రూ.5 ఎక్కువ ఛార్జీ! కండక్టర్‌ను ఉతికారేసిన ప్రయాణికుడు

15 Sep, 2022 10:13 IST|Sakshi

వైరల్‌: ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో.. ఏ రూట్‌లలో ఎంతెంత పెరిగాయో, అదీ రోజువారీ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు సైతం అంతుచిక్కడం లేదు. పైగా టార్గెట్‌ల పేరిట ఒక స్టాప్‌ బదులు.. మరోస్టాప్‌కు టికెట్‌ కొడుతూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు కొందరు కండక్టర్లు. దేశంలోని చాలా నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలా.. అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ఓ కండక్టర్‌ను చితకబాదేశాడు ఓ ప్రయాణికుడు. 

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో తాజాగా జరిగిన ఘటన ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో.. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ బస్టాప్‌ దగ్గర ఓ వ్యక్తి బస్సెక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్‌ కాగా.. కండక్టర్‌ మాత్రం ముందుస్టాప్‌ నుంచి టికెట్‌ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నించాడు. 

ఈ క్రమంలో ఎన్‌సీసీ క్యాడెట్‌కు చెందిన సదరు ప్రయాణికుడు.. అధిక వసూలుపై నిలదీశాడు. తాను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశాడు. అయినా సరే ఐదు రూపాయలు ఇవ్వాలని, లేదంటే దిగిపోవాలని కండక్టర్‌ చెప్పాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సదరు ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా.. ప్రయాణికుడు బస్సు దిగిపోవడం, ఆ వెనకాల కండక్టర్‌ పరుగులు తీయడం వరకు బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. 

ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది రవాణా శాఖ. దీంతో సదరు ఎన్‌సీసీ క్యాడెట్‌పై జహాంగీర్‌బాద్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇదీ చదవండి: కన్నతల్లి అనుకుని.. ఆ బస్సు వెంట పరుగులు

మరిన్ని వార్తలు