Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి

9 Dec, 2022 15:01 IST|Sakshi

గుజరాత్‌ సీఎంగా వరుసగా రెండోసారి భూపేంద్ర పటేల్‌

అహ్మదాబాద్‌: పార్టీ పట్ల అంకితభావం, కష్టించే తత్వం భూపేంద్ర పటేల్‌ను మున్సిపాలిటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేర్చాయి. గుజరాత్‌ శానససభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్‌ ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ ప్రకటించారు.

గుజరాత్‌లో ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. విజయ్‌ రూపానీ స్థానంలో పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర వైపు మొగ్గుచూపింది. అధిష్టానం అంచనాలకు తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించారు.  

2017లో రికార్డు స్థాయి మెజార్టీ 
భూపేంద్రబాయ్‌ పటేల్‌ అలియాస్‌ భూపేంద్ర పటేల్‌ 1962 జూలై 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జlచారు. 1982 ఏప్రిల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. తొలుత అహ్మదాబాద్‌ జిల్లాలోని మేమ్‌నగర్‌ మున్సిపాలిటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. రెండు సార్లు అదే మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

2010 నుంచి 2015 దాకా అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఏఎంసీ) స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ(ఏయూడీఏ) చైర్మన్‌గా సేవలందించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీదీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఘట్లోడియా శాసనసభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు.
చదవండి: గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం

ఏకంగా 1.17 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి శశికాంత్‌ పటేల్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. 2021 సెప్టెంబర్‌ 13న గుజరాత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన(2022) అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజార్టీతో నెగ్గడం గమనార్హం.  

మరిన్ని వార్తలు