Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం

11 Dec, 2022 07:00 IST|Sakshi

బీజేఎల్పీ నేతగా ఎన్నిక 

సీఎంగా రెండోసారి ప్రమాణం

గాంధీనగర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్‌ ముండా హాజరయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్‌ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్‌ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు.

ఇదీ చదవండి: హిమాచల్‌ సీఎంగా సుఖు

మరిన్ని వార్తలు