‘ఐటెం సాంగ్‌’ ఆరోపణలు.. మహిళా జడ్జికి ఊరట ఇచ్చిన సుప్రీం కోర్టు, ఏం చెప్పిందంటే..

10 Feb, 2022 11:51 IST|Sakshi

హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్​కు చిందులేయాని బలవంతం చేశారని ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు  న్యాయమూర్తికి ఊరట లభించింది. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్​ మరక’గా  దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది. అయితే ఈ ఉదంతంలో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు మధ్యప్రదేశ్​ హైకోర్టుకు తెలిపింది.

2014లో సదరు మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని, ఆ కారణంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్​ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్​ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్​ గవాయ్​ తెలిపారు.  

ఏం జరిగిందంటే.. 
జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు దిగింది. ఈ వేధింపులపై రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి,  కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్‌లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది.

ఓ ఐటెం సాంగ్‌లో తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించిందామె. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్​ గత ఏడాది డిసెంబర్‌లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. 

ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్​ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది.

మరిన్ని వార్తలు