పాట్నా : బిహార్లో వరద ఉధృతి కొనసాగుతోంది. నేపాల్లోని నదుల నుంచి బిహార్కు నీరు పోటెత్తడంతో రాష్ట్రంలోని 16 జిల్లాలు జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో గురువారం కొత్తగా ఇద్దరు మృతి చెందడంతో వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 21కు చేరింది. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో 69 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఎవతెరపి లేని వర్షాలతో తోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4.82 లక్షల మందిని ఖాళీ చేయించగా.. వారిలో 12, 239 మందిని ఎనిమిది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. (బిహార్కు మరో చేదు వార్త)
రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 20కి పైగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఖగారియా జిల్లాలోని బుధి గండక్ నది వెంబడి ఉన్న ఆనకట్ట తెగిపోవడంతో వరదలు పోటెత్తాయి. అయితే ఆనకట్ట వద్ద మరమ్మత్తు పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని జల వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని సితామార్హి, సుపాల్, షియోహర్, తూర్పు చంపారన్, గోపాల్ గంజ్ సహర్సా, మాధేపుర, మధు బని, సమస్తిపూర్ జిల్లాలు వరద ప్రభావానికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. (భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం)