'గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్' పనులు పరిశీలించిన నితీష్ కుమార్‌

20 Dec, 2020 16:51 IST|Sakshi

పాట్నా: రాజ్‌గిర్‌లోని పర్యాటక హాట్‌స్పాట్ 'ప్రకృతి సఫారీ' పనులను బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 'గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్' (స్కై వాక్) పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సందర్శనలో భాగంగా జీప్ లైన్, జీప్ బైక్, ప్రకృతి సఫారీ ప్రధాన క్యాంప్ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. 'గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్' (స్కై వాక్) యొక్క నిర్మాణ, నిర్వహణ, రక్షణ విషయంలో నిపుణుల సహాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. (చదవండి: ఈ నెల 25న రైతులతో ప్రధాని మోదీ భేటీ)

బిహార్‌‌లోని రాజ్‌గీర్‌లో 'ప్రకృతి సఫ్రీ' నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ప్రకృతి పార్కును  సీఎం నితీష్ కుమార్ కలల ప్రాజెక్టుగా భావిస్తారు. రాజ్‌గీర్ ప్రజలకు గంగానది నుండి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా నలంద విశ్వవిద్యాలయం, రక్షణ, పోలీసు సిబ్బంది, గృహాలు,హోటల్స్‌... ఇలా ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించాలని సీఎం కోరారు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక ఎవరు కూడా తాగునీటి కోసం భూగర్భ జలాలను ఉపయోగించకూడదని పేర్కొన్నారు. భూగర్భ జలాలను తోడేయడం ద్వారా గొప్ప వారసత్వం(రాజ్‌గీర్) దెబ్బతిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ స్థలాలను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నితీస్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు