బైక్‌ మీదే వెకిలి చేష్టలు.. గ్రామస్థుల దెబ్బకు క్షమాపణలు

6 Aug, 2021 18:58 IST|Sakshi

వీడియో వైరల్‌.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్‌

పట్నా: జంతువులకు, మనుషులకు మధ్య ప్రధాన తేడా.. వాటికి విచక్షణ జ్ఞానం ఉండదు.. మనకు ఉంటుంది. మంచేదో.. చెడేదో మనుషులకు తెలుసు. మనకు సిగ్గు, బిడియం, కోపం వంటి లక్షణాలుంటాయి. అలాగే మనషుల దైనందిన జీవితంలో నలుగురిలో చేసే పనులు.. నాలుగ్గోడల మధ్య చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. దాన్ని కాదని.. సిగ్గు, శరం వదిలేసి నాలుగ్గోడల మధ్య చేసే పనిని బహిరంగంగా చేస్తే.. జంతువులకు మనకు తేడా ఏముంటుంది. మనకంటే అవే చాలా బేటర్‌ అనిపిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్లు తమ చేతులకు, నోటికి పని చెప్తారు.

ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే.. బిహార్‌లో ఓ జంట చేసిన పని చూసి జనాలు, నెటిజనులు ఇలానే దుమ్మెత్తి పోస్తున్నారు. మీకు ఏమాత్రం సిగ్గు, శరం లేవా అని ప్రశ్నిస్తున్నారు. వారి సిగ్గుమాలిన పనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆవివరాలు..

కొన్ని రోజుల క్రితం బిహార్‌, గయ జిల్లాకు చెందిన ఓ జంట రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ మీద ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా కూర్చునేదానికి భిన్నంగా.. యువతి బైక్‌ నడిపే వ్యక్తికి ఎదురుగా.. ఫ్యూయెల్‌ ట్యాంక్‌ మీద కూర్చుని ఉంటుంది. అలా బైక్‌ డ్రైవ్‌ చేస్తూనే.. రోడ్డు మీద పట్టపగలు ఆ జంట సరసాలాడటం ప్రారంభించారు. 

వీరి వికృత చేష్టలు గమనించిన స్థానికులు.. వాటిని వీడియో తీయడం ప్రారంభించారు. తమ చేష్టలను వీడియో తీస్తున్నారని గ్రహించిన యువతి.. వారిపై మండిపడింది. ఈ క్రమంలో స్థానికులకు, జంటకు మధ్య గొడవ జరగింది. రోడ్డు మీద ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం ఏంటని జంటను గట్టిగానే మందలించారు స్థానికులు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా ఇలా ఇష్టారీతిగా ప్రవర్తించడం ఏంటి.. మీ వల్ల ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు.. ఇంత నీచంగా ప్రవర్తించడం ఏంటని తిట్టి పోశారు. క్షమాపణలు చెప్పాకే ఆ జంటను వదిలేశారు. ఇంకెప్పుడు ఇలాంటి పనికి మాలిన పనులు చేయవద్దని.. తమ గ్రామంలోకి రావద్దని హెచ్చరించారు స్థానికులు.
 

మరిన్ని వార్తలు