-

ఏడో తరగతి పరీక్ష పేపర్‌లోని ప్రశ్న వివాదాస్పదం...నెటిజన్లు ఫైర్‌

19 Oct, 2022 13:19 IST|Sakshi

బిహార్‌: ఏడో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ పరీక్ష పేపర్‌లోని ప్రశ్న ఏమిటంటే...నేపాల్‌, చైనా, ఇంగ్లాండ్‌, కాశ్మీర్‌, భారత్‌ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇందులో కాశ్మీర్‌ని వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదానికి దారితీసింది. అంతేగాదు ఈ వివాదం కాస్త చిలికిచిలికి రాజకీయ దుమారానికి తెరలేపింది.

ఇది పొరపాటు కాదని కావలనే ఇలా చేశారంటూ ఆ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌​ సుశాంత గోపీ విమర్శలు గుప్పించారు. పిల్లలు మనసుల్లో కాశ్మీర్‌ను భారత్‌ని వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోంది నితీశ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పైగా రాజకీయంగా పట్టు సాధించాలనే నితీష్‌ కుమార్‌ కుట్రలోని భాగం ఇది అంటూ విమర్శులు ఎక్కుపెట్టారు.

ఇదిలా ఉండగా...ఆ పాఠశాల హెడ్‌మాస్టర్‌ ఎస్‌కే దాస్‌ ఈ విషయమై వివరణ ఇస్తూ...ఆ ప్రశ్న పత్రంలో ప్రశ్న కాశ్మీర్‌ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానకి బదులు కాశ్మీర్‌ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇది మానవ తప్పిదమే తప్ప మరోకటి కాదని వివరణ ఇచ్చారు. అంతేగాదు ఆ జిల్లా విద్యాధికారి సుభాష్‌ గుప్త అనవసరంగా ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారన్నారు.

అచ్చం ఇలానే ఐదేళ్ల క్రితం 2017లో బిహార్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఇదే ప్రశ్న ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు బీహార్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తన తప్పుని సరిచేసుకోలేకపోవడం బాధాకరం. ఈ మేరకు ఈ విషయం నెట్టింట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు మండిపడటమే కాకుండా సదరు టీచర్‌ని తొలగించాలంటూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: భార్యా హంతకునికి  జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు)

మరిన్ని వార్తలు