రియల్‌ కేజీఎఫ్‌.. దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు.. ఎక్కడంటే!

28 May, 2022 21:55 IST|Sakshi

బంగారం గనుల నేపథ్యంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ సినిమా యావత్ దేశాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. నిన్న వరకు రీల్‌ లైఫ్‌లో బంగారం గనులు నేడు రియల్‌ లైఫ్‌లోనూ అదే తరహాలో బంగారం నిల్వ ఉన్నట్లు బీహార్‌లోని జ‌ముయి జిల్లాలో బయట పడింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని జ‌ముయి జిల్లా దేశంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్నాయని ఈ జిల్లా ప‌రిధిలో బంగారం తవ్వకానికి అనుమ‌తులు జారీ చేసే యోచనలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.

జముయి జిల్లాలోని కర్మతియా, ఝఝా, సోనో వంటి ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు సూచించిన జీఎస్‌ఐ నిర్ధారణలను విశ్లేషించిన తర్వాత పలు సంస్ధలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ కమ్ మైన్స్ కమిషనర్ హర్జోత్ కౌర్ బమ్రాహ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల వ్యవధిలో జీ3 (ప్రిలిమినరీ) దశ అన్వేషణ కోసం కేంద్ర ఏజెన్సీ లేదా ఏజెన్సీలతో ఎంఓయూ సంతకం చేసే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

జియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ప్ర‌కారం జ‌ముయి జిల్లాలోని గోల్డ్ రిజ‌ర్వులో 222.88 మిలియ‌న్ ట‌న్నుల బంగారం, 37.6 ట‌న్నుల ఖ‌నిజాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. దేశంలో బంగారు నిల్వల్లో అత్యధిక వాటా బీహార్‌లో ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గత ఏడాది లోక్‌సభకు తెలియజేశారు. బీహార్‌లో 222.885 మిలియన్ టన్నుల బంగారు లోహం ఉందని, ఇది దేశంలోని మొత్తం బంగారం నిల్వల్లో 44 శాతం అని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
 

మరిన్ని వార్తలు