పాము కాటేసిందన్న కోపంతో.. కస కస కొరికాడు.. ఆ తర్వాత..

10 Aug, 2021 15:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్నా: బిహర్‌లో ఓ వృద్ధుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. తనను కాటువేసిందన్న కోపంతో ఆ పాము పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దాన్ని పట్టుకుని విచక్షణ రహితంగా కొరికాడు. అంతటితో ఆగకుండా పాముని అక్కడే ఉన్న చెట్టుపై వేలాడ దీశాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. నలంద జిల్లాలోని మాధోపూర్‌ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోని ఆదివారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. వెంటపడి మరీ పామును పట్టుకుని కసితిరా కొరికి చంపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీశాడు.

పాముపట్ల వింతగా ప్రవర్తించిన వృద్ధుని తీరు చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, మహతో ఎవరిమాట పట్టించుకోలేదు. పాముని చంపేశాను...నాకేం కాదు అని మొండిగా ప్రవర్తించాడు. కాగా, రాత్రి మహతో భోజనం చేసి పడుకున్నాడు. ఆ తర్వాత మహతో నిద్రలోనే స్పృహ తప్పిపడిపోయాడు. ఎంత పిలిచిన లేవకపోయేసరికి.. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహతోను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా‍ప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు