బిహార్‌ మంత్రిని క‌బ‌ళించిన క‌రోనా

16 Oct, 2020 20:39 IST|Sakshi

పాట్నా :  క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ఎంద‌రో రాజ‌కీయ నేత‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. తాజాగా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్‌ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69) ను  క‌బ‌లించింది.  కొన్ని రోజులు క్రితం ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు. అయితే అంత‌కుముందు ఆయ‌న‌కు కిడ్నీ స‌హా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ప‌రిస్థితి విష‌మించి కామ‌త్ మ‌ర‌ణించిన‌ట్లు ఎయ్‌మ్స్ వైద్యులు శుక్ర‌వారం దృవీక‌రించారు.

వెంటిలేట‌ర్‌పై చికిత్స అందించిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాలేద‌ని తెలిపారు. కామ‌త్ మృతిప‌ట్ల జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎంతో నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తిని కోల్పోవ‌డం చాలా బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని ట్వీట్ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే త‌త్వం కామత్‌ది అంటూ పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణం రాజ‌కీయ రంగానికే తీర‌ని లోటని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలంటూ సీఎం ట్వీట్ చేశారు.  


 

మరిన్ని వార్తలు